దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు-288 భద్రమారుతి దేవాలయం –ఖుల్దా బాద్ –

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు-288

భద్రమారుతి   దేవాలయం –ఖుల్దా బాద్ –

మహా రాష్ట్రలోమరాట్వాడా అనిపిలువబడే  ఔరంగాబాద్ జిల్లా ప్రసిద్ధ  ఎల్లోరా గుహలకు సమీపం లో ఖుల్దాబాద్ లో శ్రీ భద్ర మారుతీ దేవాలయం సుప్రసిద్ధమైనది . దీని పూర్వకాలపు పేరు భద్రావతి..మొగలాయీ పాలన కాలం లో ఖుల్దాబాద్ గా పేరు మార్చారు .పార్సీ భాషలో ‘’ఖుల్దా ‘’అంటే స్వర్గ ద్వారం అని అర్ధం .భద్రావతి అంటే సురక్షిత ప్రాంతం ,పవిత్ర ప్రదేశం అని అర్ధాలున్నాయి .ఏ పేరైనా దాని ప్రత్యేకతనే తెలియ జేస్తోంది .దేశం లోని 12 జ్యోతిర్లింగాలలో 4 మహారాష్ట్రలోనే ఉండటం ప్రత్యేకత .  అవే త్రయంబకేశ్వరం ఘ్రుష్ణేశ్వరం  ,నాగనాదేశ్వరం    భీమ శంకరేశ్వరం .

ఎల్లోరా గుహలకు అతి దగ్గరలోనాలుగు కిలోమీటర్ల దూరం లో  శ్రీ భద్ర మారుతి దేవాలయం ఉంది  . ఇక్కడి మారుతి అరుదైన ఆకృతిలో వెనుకకు వాలి ఉన్న భంగిమలో కనీ పించటం మరీ విశేషం .దీని వెనుక ఒక కధ ఉంది .ఒకప్పుడు ఈ భద్రావతి ప్రాంతాన్ని శ్రీరామ భక్తుడైన భద్ర సేన మహారాజు పాలించేవాడు.శ్రీరాముడిని పరమ పవిత్ర మూర్తిగా, ఆపన్న రక్షకునిగా,  రామ భద్ర మూర్తిగా భావించి అర్చి౦చేవాడు .  .ఇక్కడున్న శ్రీరామాలయానికి అనువుగా ఒక చెరువు త్రవ్వించి దానికి భద్ర కుండం అని పేరుపెట్టాడు .ఈ చెరువులోనిత్యం  పవిత్ర స్నానం చేసిన తరువాత మాత్రమే శ్రీరామ భద్రుని దర్శించి పూజించేవాడు .అందమైన తన గారాల కూతురుకు ‘’భద్ర ‘’అని పేరు పెట్టుకొన్నాడు .అందుకే ఈనగరానికి భద్రావతి అనే పేరొచ్చింది .

శ్రీరామ భక్తుడైన భద్ర సేన మహా రాజు గొప్ప సంగీత విద్వా౦సుడుకూడా .తానే స్వయం గా శ్రీరాముని పై కీర్తనలు రాసి స్వరాలు కట్టి  తన్మయత్వం తో అతి మధురంగా గానం చేసి  రామునికి నివేదనగా వినిపించేవాడు ..ఈ గానానికి ప్రక్రుతి పులకించి పోయేది .భక్తుల మనసు ఆనంద డోలికలలో ఊగేది..అందరూ అరమూసిన కనులతో ఆ గాన మాధుర్యం లో తన్మయులై మేను మరచేవారు .శ్రీరామ దర్శనాను భూతి పొందేవారు. మహా రాజు గానానికి, సంగీత సాహిత్యాలకు అంతటి ప్రభావం ఉండేది .రామునికి దగ్గరై, ఐహిక సుఖాలకు దూరమై భద్రసేన మహా రాజు మహా తపస్సంపన్నుడయ్యాడు .ఈ రకం గా శ్రీ రామ భజన ఉదయం నుండి సాయంకాలం వరకు కొనసాగేది .కొన్ని సార్లు కొన్ని రోజులు ఆపు లేకుండా జరిగేది . .

‘’యత్ర యత్ర రఘు నాద కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం ‘’అన్నట్లు ఇంత గొప్పగా రామభజన, కీర్తనా జరుగుతుంటే రామ భక్త హనుమాన్ అక్కడికి రాకుండా ఉండ గలడా ?’’పారిజాత తరుమూల వాసియై ‘’హనుమ రామధ్యానం లో ,ఉండకుండా ఉండగలడా?.భద్రసేన మహారాజు దివ్య రామనామ సంకీర్తనలకు పులకించి ఆనంద  బాష్ప  దారలు కన్నుల వెంట కారుతుండగా వింటూ మైమరచి పోయి ,రాజు రామభక్తికి జోహార్లు అర్పించేవాడు మనసులోనే .భద్రసేనుని గానానికి పక్షులు తన్మయం చెంది వినేవి .చెట్ల కొమ్మలు సవ్వడి సేయకుండా విని  పుష్ప వృష్టి కురిపించి అభినందించేవి .యావత్ ప్రక్రుతి రామ గానామృతం లో తడిసి ముద్ద అయి దివ్యానుభవం పొందేది .

గంటలకొద్దీ రాజర్షి భద్ర సేన మహా రాజు రామ గానాన్ని వెనక్కి వాలి పోయి  వింటూ ,భావ సమాధిలో మునిగి పోయేవాడు హనుమాన్ .రాజు తన భావ సమాధి నుంచి బయట పడి ,కనులు తెరచి చూస్తే, భావ సమాధిలో తన్మయ స్థితిలోతనకు అత్యంత సమీపం లో  ఉన్న మారుతి ని చూసి ఆశ్చర్య పద్డాడు . వెంటనే మారుతి పాదాల పై వ్రాలి తన భక్తిని ప్రకటి౦ చాడు .అప్పుడు భావ సమాధిలో ఉన్న మారుతి ధ్యానానికి  భంగం కలిగింది  .అప్పుడు హనుమాన్ ‘’రాజర్షి భద్ర సేన మహా రాజా !నీ రామ భక్తికి ఎంతో తన్మయుడనయి,ఆనందించాను .నీకు శ్రీరామ దర్శనం కలిగిస్తాను .ఇంకా నీ మనసులో కోరికలేవైనా ఉంటే చెప్పు ‘’అని అడిగాడు .

అదే తన్మయ స్థితిలో ఉన్న రాజర్షి భద్ర సేనుడు ‘’మహాత్మా !నువ్వే నా పాలిటి శ్రీరామ భద్రుడివి .నీకు శ్రీరామాశీస్సులున్నాయి .నీ దర్శనం కలిగినదీ అంటే నాకు శ్రీరాముని కృపా విశేషం లభించినట్లే .నువ్వు ఆనందాను భూతి పొంది నన్ను సంత్రుప్తుడిని చేశావు .అయితే ప్రభూ ! నువ్వు ఇదే భావ సమాధిలో ఇక్కడ ఈ క్షేత్రం లో స్థిరంగా నిలిచి పోయి, భక్తులను సదా అనుగ్రహించవలసినదిగా,కన్యలకు సద్బుద్ధిని అనుకూలుడైన భర్తను అనుగ్రహిస్తూ  నీ భక్తులకు సకల శ్రేయస్సులు కలిగించవలసినదిగా  నా విన్నపం ‘’అని ప్రార్ధించాడు .’’తధాస్తు ‘’అన్నాడు మారుతి .రాజర్షి భద్ర సేన మహారాజుకు ఇచ్చిన మాట ప్రకారం మారుతి ఇక్కడే ‘’భద్ర మారుతి ‘’గా భావ సమాధి భంగిమలోనే  ఉండి ,భక్తులకు సర్వ శుభ మంగళాలు  చేకూరుస్తూ  అనుగ్రహిస్తున్నాడు ..

Inline image 1Inline image 2

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-3-16-ఉయ్యూరు

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.