— దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2
264—గయలో ఆంజనేయ దేవాలయాలు
బీహార్ లోని ప్రసిద్ధ యాత్రాస్థలం గయా లో శ్రీ ఆంజనేయ దేవాలయాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైన వాటిని గురించి తెలుసుకొందాం .అందులో మొదటగా చెప్ప దగినది మహా వీర్ మందిరం లోని సంకట మోచన్ హనుమాన్ దీనినే హనుమాన్ మందిర్ అంటారు .ఎప్పుడూ భక్తుల రద్దీతో ఆలయం ఉంటుంది .మహావీరమందిరం అతి పురాతనమైనది అలాగే హనుమాన్ మందిరం కూడా .మంగళ శనివారాలలో భక్తుల సంఖ్య అసంఖ్యాకం గా ఉంటుంది .శ్రీరామ నవమి నాడు మహావీర్ ,సంకతమోచన్ హనుమాన్ లను దర్శించే క్యూ కనీసం కిలోమీటర్ పొడవు ఉంటుంది .
265-102 అడుగుల ఆగార హనుమాన్ దేవాలయం –బెంగళూర్
కర్నాటక లోని బెంగళూర్ లో ఆగ్నేయ భాగం లో అందమైన ఆగారా సరస్సు ఉంది దాని దగ్గరే శ్రీ ఆగారా ఆంజనేయ స్వామి 102అడుగుల భారీ విగ్రహం ఉంది .ఇటీవల ఏర్పడినదే .ఇక్కడే ఉన్న జగన్నాధ స్వామి దేవాలయమూ దర్శించ తగినదే .ఈ రెండు ఆలయాలు చిన్నవే కాని బయటఉన్న హనుమ విగ్రహం బృహత్తర రూపం .స్వామి పద్మం లో నిలబడి తూర్పు ముఖంగా ఉండటం ప్రత్యేకత . .ఉదయం పూట స్వామి ముఖం దీదీప్యమానంగా ,మధ్యాహ్నం వెనుకభాగం కాంతి వంతంగా కనిపిస్తుంది .ప్రక్కనే నాగదేవతలు ఉంటారు .ఈ భారీ హనుమాన్ ముందున్న చిన్న దేవాలయాన్ని ‘’సీతారామ భక్త హనుమంత దేవాలయం ‘’అనిపిలుస్తారు .భారీ విగ్రహం వెనుక మరో ఆంజనేయ దేవాలయం ఉంది .
266-కార్య సిద్ధి హనుమాన్ –మైసూర్
కర్నాటక లోని మైసూర్ లో 41 అడుగుల ఏక శీలా శ్రీ కార్య సిద్ధి హనుమాన్ విగ్రహాన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 26-12-2012న ఆవిష్కరించారు .విగ్రహం తయారీకి రెండు కోట్లు ఖర్చయింది విగ్రహ శిల ఆంద్ర ప్రదేశ్ లోని పులివెందల దగ్గరున్న మేల్లెల గ్రామం కు చెందినది అక్కడే సగం పైగా విగ్రహ నిర్మాణం చేయించి 90 చక్రాల భారీ వాహనం పై ఇక్కడికి తెచ్చి విగ్రహం పూర్తిగా మలిచారు .ముఖ్య స్థపతి శ్రీ సుబ్రహ్మణ్య ఆచార నేతృత్వం లో శిల్పులు పది నెలలు కష్టించి తయారు చేశారు . అష్ట దళ ఆకారం ఉన్న వేదికపై శ్రీ కార్య సిద్ధి హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు విగ్రహం 200 టన్నుల బరువు ఉంది .
267- శ్రీ కోటే ఆంజనేయస్వామి దేవాలయం –షిమోగా
కర్ణాటకలో కేలడి వంశానికి చెందిన .శివప్పనాయకుడు 16 వ శతాబ్దం లో పాలించిన ప్రదేశమే షిమోగా లేక శివ మొగ్గ .ఇక్కడే పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది .ఇదే కోటే హనుమాన్ ఆలయం .దీని చరిత్ర త్రేతా యుగం నాటిది. రామాయణం తో సంబంధం ఉంది. హనుమ సంజీవిని పర్వతం తెచ్చే కద తో ముడిపడి ఉంది .ఇది పెద్ద దేవాలయం భారీ సింహ ద్వారం ఉంది .తుంగా నది తీరం లో ఆలయం ఉంటుంది .ఇక్కడ దూర్వాస మహర్షి తపస్సు చేశాడు .అందుకనే దీన్ని ‘’దూర్వాస క్షేత్రం’’ అంటారు .