దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 206-ఉయ్యూరు శివాలయం లో ‘’గుండు’’వారి ప్రసన్నాంజనేయ స్వామి

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

206-ఉయ్యూరు శివాలయం లో ‘’గుండు’’వారి ప్రసన్నాంజనేయ స్వామి

కృష్ణాజిల్లా ఉయ్యూరు గ్రామం లో శ్రీ భ్రమరాంబా సమేత సోమేశ్వర ఆలయం (శివాలయం )లో గుండువారి ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం చూడ ముచ్చటగా ఉండటమేకాక ప్రత్యెక కధనం కూడా కలిగి ఉంది .

విగ్రహానికి నేపధ్యం

ఉయ్యూరులో మా ఇంటికి ఉత్తరం వైపు మా మేనమామ గుండు గంగయ్య అనబడే గంగాధర శాస్త్రి గారి ఇల్లు ఉంది .వారిది కామకాయనస గోత్రం ..మా అమ్మ భవానమ్మగారికి గంగయ్యగారు తమ్ముడు . ఆయన్నుపెద్దవాళ్లందరూ  గంగయ్య అని చిన్నవారంతా  గంగయ్య గారు అని  పిలిచేవారు .స్తితిపరులు .వాళ్లకు ఉయ్యూరుకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం లో పెనమకూరుకు వెళ్ళేదారిలోకనక వల్లిగ్రామం లో  ఒక శివాలయం ఉంది .రాజమండ్రిలో విగ్రహాలను చెక్కించి ఆగమ శాస్త్ర విధానం లో కనకవల్లిలో 1954లో  వారం రోజులు బ్రహ్మాండంగా ప్రతిస్టామహోత్సవాలు నిర్వహించారు .మా అమ్మా మామయ్యల పిన తండ్రి (నాన్నగుండు  సింగిరి శాస్త్రి గారి తమ్ముడు ) నరసింహం గారి ఆధ్వర్యం లో మామేనమామ, మా అత్త మహాలక్ష్మమ్మ దంపతులు ప్రతిష్ట చేశారు .కనకవల్లి గ్రామ బ్రాహ్మణ్యం అంతా రెండు పూటలా భోజన ఉపాహారాలు అక్కడే . .పెళ్లి వేడుకలను మించి ఘనం గా ప్రతిస్టా మహోత్సవం జరిగింది .ఇదంతా మా చిన్ననాటి సంగతి  అప్పుడు మేము తొమ్మిదో తరగతి చదువుతున్నామని గుర్తు .అయినా బాగా జ్ఞాపకం ఉంది .అందరికి తమలపాకులు, వక్కపొడి మా గబ్బిట వారి కుటుంబం మా నాన్నగారు మృత్యుంజయ శాస్త్రి ,అమ్మ భవానమ్మ దంపతుల ఆధ్వర్యం ఏర్పాటు చేయ బడింది . మా తాతయ్య నరసింహం గారు ఆయన అను౦గు మిత్రుడు సీతం రాజు లక్ష్మీ నారాయణ గారు ఆంద్ర రాష్ట్రం లో అంతటా తిరిగి నిధులు సేకరించి ప్రతిస్టా కార్యక్రమాన్ని మహా ప్రతిష్టగా తీసుకొని పరమ వైభవం గా నిర్వహించారు .వంట బ్రాహ్మణులు మహా రుచికరంగా పదార్ధాలు వండేవారు ఈ వంటవారిచేతనే  ఆ తర్వాతా మా చిన్నక్కయ్య శ్రీమతి దుర్గ శ్రీ వేలూరి వివేకానందం బావ గార్ల వివాహానికి వంట చేయించాం అప్పుడూ మహా భేషుగ్గ్గా చేశారు .అందులో ఒక ఎర్రటి ఆయన మేస్త్రీ సన్నగా బారుగా ఉండేవాడు .సీతారామయ్య అనే ఉయ్యూరు ఆయన అతని సహాయకులలో ఒకరు ఆతర్వాత సీతా రామయ్య ణా ఉపనయనానికి వంట చేశాడు .ఉయ్యూరు కనకవల్లి మొదలైన గ్రామస్తుల సహకారం మరువ లేనిది . అ ప్పుడే మా తాతయ్యకు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిస్టించాలనే సంకల్పం కూడా ఉండేది .సమయం చాలక అది కార్య రూపం దాల్చలేదు .కాని ఆయనమన్సులోనుండి అది తొలగిపోలేదు .

కనకవల్లి ప్రతిస్టలైన తర్వాతా నరసింహం తాతయ్య రాజమండ్రి లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారల 5 అడుగుల భారీ విగ్రహాన్ని చెక్కించారు .అది పడవలమీద గోదావరి కృష్ణా నదులలో ప్రయాణం చేసి పుల్లేరు కాలువద్వారా ఉయ్యూరు చేరింది . పుల్లేరు కాలువ నుండి మామయ్యా వాళ్ళ రెండెడ్ల బండీ చట్రానికి కింద మోకులతో కట్టి అతి జాగ్రత్తగా ఇంటికి తేవటం నాకు బాగా గుర్తు .అంతటి భారీ విగ్రాన్ని ప్రతిష్టించి గుడికట్టటానికి తగిన ఆర్ధిక స్తోమత అప్పుడు మా మామయ్యకు లేకపోవటం వలన  విష్ణ్వాలయం వెనుక వేగరాజుసీతారామయ్య గారి  ఇంటికి ఆనుకొని ఉన్నమామయ్యగారి  పెంకుటిల్లు ఉత్తర౦ వైపు  గోడ కు ఈశాన్య భాగాన ఏటవాలుగా వాల్చి 1972లో  నిలబెట్టారు  బహుశా అదే ప్రతిష్ట ఏమో ? ‘’శ్రీ గుండు లక్ష్మీ నరసింహ సంకల్పః –శ్రీ ప్రసన్నాంజనేయ స్వామినః శ్రీ గుండు గంగాధర శాస్త్రి ణా26-1-1972ప్రతి ష్టితః  200 రూపాయలు ‘’అని రాసి శిలాఫలకం వేయించారు  .విగ్రహం పైన ఆచ్చాదన కూడా ఏర్పాటు చేయలేదు .ఎండకు ఎండుతూ వానకు నానుతూ  ఆంజనేయస్వామి ఏమీ అనలేక అలాగే ఉండిపోయాడు దేవుడికైనా మంచి రోజు రావాల్సిందే .అంత దాకా ఎదురు చూడక తప్పదు .  పోకల దమ్మక్క పూనుకోక పోతే భద్రాద్రి రాముడికి గూడు ఉండేదా? .భక్త రామ దాసు పూనుకోక పోతే రామయ్యకు భద్రాచలం లో ఆలయ నిర్మాణం జరిగేదా?ఊరి ప్రజలందరూ ఈ ఆంజనేయ విగ్రహాన్ని చూస్తూ ,అయ్యో అనుకొంటూ ఉండేవారు .కాలక్రమలో నరసింహం తాతయ్యా చనిపోయాడు .మామయ్యా కుటుంబమూ పెరిగింది .

శివాలయం లో దేవతల సమూహం

కాలం ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదు . కొందరు ఉత్సాహ వంతులు ఉయ్యూరు శివాలయం లో శ్రీ వెంకటేశ్వర స్వామిని ,శంకరాచార్యులవారిని మొదలైన వారిని ప్రతిష్ట చేయాలనే ఆలోచనలో ఉన్నారు .దీనికి ఒక కమిటీ ఏర్పడింది .ఊరి పెద్దలు శివాలయానికి సమీపం లోనే ఉండే గోవింద రాజు శ్రీరామ మూర్తి గారు అధ్యక్షులుగా ,సీతం రాజు సత్యనారాయణ గారు ,కొలచల వెంకటా చలపతి మొదలైన వారు కార్య వర్గ సభ్యులుగా కమిటీ ఏర్పడి అప్పటి కే సి పి ప్లాంట్ మేనేజర్ శ్రీ ఇంజేటి జగన్నాధ రావు గారిని కలిసి విషయం వివరించారు .ఆయన వెంటనే అంగీకరించి ఫాక్టరీ వారి సహకారం లభించేట్లు చేసి శివాలయం లో దక్షిణం వైపు గోడను ఆనుకొని లోపల సుమారు ఎనిమిది అడుగుల వెడల్పున అరవై అడుగుల పొడవున ఒక ఆస్బెస్టాస్ రేకుల షెడ్డు నిర్మించటానికి పూనుకొన్నారు .విగ్రహ సముదాయాన్ని అందులో ప్రతిష్టి స్తే బాగుంటుందని చెప్పారు .అందరూ అంగీకరించారు .విగ్రహ ప్రతిష్ట చేసేవారి వారినుండి కనీసం 2,౦౦౦ రూపాయలు విరాళంగా స్వీకరించారు .మామయ్యా గంగయ్య గారికి కూడా అందరూ చెప్పారు .ఇక ఆయన ఆంజనేయ విగ్రహాన్ని వేరే చోట ప్రతిష్టించి ఆలయం కట్టే పరిస్తితిలో లేరు కనుక ఈ సముదాయ ప్రతిస్టలలో దానినీ చేయమని నచ్చ జెప్పారు .చివరికి అంగీకరించాడు మామయ్య.

ప్రతిస్టామహోత్సవం

శివాలయంకు   విశాలమైన బయటి ప్రాంగణం ఉన్నది కనుక విగ్రహాలను ఉంచటానికి జలాదివాస ధాన్యాది వాసాలకు ఇబ్బంది లేదు .మంచి ఆగమ పండితులు లభించారు. అగ్నిమధనం చూడ ముచ్చటగా జరిగింది .ఎవరు ఏ దేవుని ప్రతిస్టించాలో వారు దంపత్యుక్తంగా కూర్చుని ప్రతిష్ట చేశారు. మామయ్యా గంగాధర శాస్త్రిగారు ,అత్త మహాలక్ష్మమ్మగారు ద౦పత్యుక్తంగా కూర్చుని శ్రీ  ప్రసన్నాంజ నేయ స్వామి వారి ప్రతిస్టా మహోత్సవం జరిపారు .పాత శిలాఫలకాన్ని ఈ విగ్రహం గూడు పైన ఇప్పుడు  అంటించ బడి  ఉంది .చుట్టూ ప్రదక్షిణ చేసే చిన్న దారికూడా ఏర్పాటు చేశారు .అన్ని ప్రతిష్టలు అయిన తర్వాతా భారీగా అన్నదానం నిర్వహించారు .విడిగా స్వయంగా ప్రతిస్టింప బడాల్సిన స్వామి ఇప్పుడు ‘’గుంపులో గోవిందా అయ్యాడు ‘’.శివాలయ పూజారులే ఈ విగ్రహాలకూ నిత్యం నైవేద్యం పెడతారనుకొంటా .ఈ కాంప్లెక్స్ అంతా పూర్తీ అయి సభా మందిరం కూడా ఏర్పడి వేదిక కూడా కట్టి శ్రీ జగన్నాధ రావు గారి చేత 26-2-1987న ప్రారంభోత్సవం చేయించారు .కనుక ప్రసన్నాంజనేయస్వామి దాదాపు పదిహేడేళ్ళు గుండువారింటి గోడకు ఆనుకొనే అన్నీ భరిస్తూ ఉన్నాడన్నమాట .అందుకనే ఈ విగ్రహాన్ని ‘’గుండువారి ప్రసన్నాంజ నేయ స్వామి ‘’అంటారు .మామయ్య  ఈ ప్రతిష్ట జరిగిన కొన్నేళ్ళకే చనిపోయాడు .స్వయంగా స్వామిని ప్రతిష్ట చేయలేక పోయానే అనే బాధ మామయ్య లో కనిపించేది .

ఉత్సవాలు

మామామయ్య గంగయ్య గారు చనిపోయిన తర్వాతా ఇప్పుడున్న వారిలో రెండవ కొడుకు గుండు నరహరి ఈ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం గురించి పట్టించుకొంటూ ,రంగులు వేయిస్తూ ,శ్రీహనుమజ్జయంతిని జరు పుతున్నాడని శివాలయ అర్చకులు చెప్పారు .స్వామి కనులు విశాలంగా అతి ప్రసన్నంగా దర్శన మిస్తాయి .నమస్కారం చేస్తున్న హస్తాలతో  నుదుట తిరునామం తో మెడ నిండా శరీరం నిండా సహజ ఆభరణాలతో  ఆకు పచ్చ రంగు అంగ వస్త్రం తో  శిరసుపై కిరీటం తో కాలికి చుట్టుకొన్న వాలం తో భక్త జన సులభుడుగా గుండువారి ప్రసన్నాంజనేయ స్వామి దర్శన మిస్తాడు తప్పక దర్శింఛి తరించాలి .ఫోటోలు జత చేశాను చూడండి –

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-5-15 –ఉయ్యూరు

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.