ఉత్త రా ఖండ్ లో బదరీనాద్ దారిలో సమీపం లో ‘’పాండు కేశ్వర్ ‘’నుండి పది కిలోమీటర్ల దూరం లో హనుమాన్ చట్టి ఉంది. ఇది ఆంజనేయస్వామి తపోభూమి .హనుమాన్ ఆలయం అలక నందా నదీ తీరం లో శోభాయమానం గా ఉంటుంది .ఒకటి యమునోత్రి దగ్గర రెండవది జ్యోశిమఠం దగ్గర రెండు హనుమాన్ చట్టి లున్నాయి .హనుమాన్ చట్టి అనేపేరు రావటానికి భారతం లో వనపర్వం లో జరిగిన కద ఆధారం .సౌగంధికా పుష్ప పరిమళాలను ద్రౌపదీ దేవి పీల్చి ఆ పుష్పాన్ని తీసుకొని రావలసినదిగా భీముడిని కోరగా అయన బయల్దేరి వెడతాడు .ఇప్పుడున్న ఈ హనుమాన్ చట్టి దగ్గరకు భీముడు చేరాడు .అక్కడ దారిలో అడ్డం గా ఒక ముసలి కోతి పడుకొని ఉంటుంది .దాన్ని దాటి వెళ్ళటానికి ఇష్టం లేని భీముడు దారి తొలగమని కోరితే తాను ముసలి దానినని ,నెమ్మదిగా లేపి పక్కన కూచేబెట్టి వెళ్ళమని కోరుతుంది ఆ ముసలి మర్కటం .సరే అని లేపుదామని ప్రయత్నిస్తే కనీసం తోక కూడాకదల్చ లేకపోతాడు భీమయ్య .ఆ వానరం సామాన్య వానరం కాదని గ్రహించి క్షమాపణ చెబుతాడు ..అప్పుడు వానర రూపం లో ఉన్న హనుమ ప్రత్యక్షమై తానూ వాయుసుతుడి నేనని హనుమ చెప్పగా ఇద్దరూ వాయుసుతులేనని గ్రహించిఅన్నదమ్ములం అని అర్ధం చేసుకొని పరస్పరం కౌగలించుకొంటారు .ఆ సంఘటన జరిగిన ప్రదేశం ఇదే అందుకే హనుమాన్ చట్టి అయింది. త్రేతాయుగ హనుమ ద్వాపర భీమ కలిసిన పవిత్ర ప్రదేశం. ఈ హనుమ ఈ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటాడని ఇక్కడి ప్రజల అచంచల విశ్వాసం .బద్రీ నాధ దారిలో వాహనాలు ఇక్కడ ఆపి ,దర్శించి బొట్టుపెట్టుకొని పైకి వెడతాయి కిందికి దిగుతాయి .అదీ ఇక్కడి ప్రత్యేకత .
123–పవాలీ హనుమాన్
ఉత్తరా ఖండ్ లో పన్నెండు వేల అడుగుల ఎత్తున ఉన్న త్రియుగీ నారాయణ్ క్షేత్రం లో పవాలీ హనుమాన్ మందిరం ఉంది .భక్తులు తప్పక దర్శించాల్సిన పవిత్ర క్షేత్రమిది .రుద్రప్రయాగజిల్లాలో త్రియుగీ నారాయణ దేవాలయం ఉంది. ఇక్కడే శివపార్వతుల కల్యాణం జరిగింది .పార్వతీ పరమేశ్వర కల్యాణం నాటి అగ్నిహోత్రం ఈనాటికి అఖండం గా అక్కడ ఇంకా వెలుగుతూనే ఉండటం విశేషం .ఈ అగ్ని హోత్రం దేవాలయం ముందు ఉంటుంది .దీన్ని దర్శించటానికి భక్తులు చేరి దర్శించి పునీతులౌతారు .అందుకే దీన్ని ‘’అఖండ ధుని ‘’అంటారు .దీనికి సమీపం లో నాలుగు స్నాన ఘట్టాలున్నాయి .త్రియుగీ నారాయణ్ లో మూడు భాగాలున్నాయి త్రి ,యుగ నారాయణ్ మూడు యుగాలలోను అంటే సత్యయుగ త్రేతాయుగ ద్వాపర యుగాలన్నమాట ఉండే విష్ణు మూర్తి అని అర్ధం .భక్తులు ఎండుకట్టెలు తెచ్చి మండే అగ్నిహోత్రానికి సమర్పించి ఆ పవిత్రాగ్ని హోత్రానికి మనసారా నమస్కరిస్తారు .
124- లక్నో హనుమాన్
ఉత్తర ప్రదేశ్ లోని లక్నో నగరం లో ఆలిగంజ్ మహల్ లో ఉన్న శ్రీహనుమాన్ దేవాలయం చాలా ప్రసిద్ధమైనది .ఇక్కడ ‘’హనుమాన్ మేళా’’ను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు .ఇక్కడ ఇది గొప్ప వేడుక లక్ష్మణుడు రామాజ్నపై సీతాదేవిని ఇక్కడే వదిలి వెళ్ళాడు .ఆ రాత్రి సీతమ్మ వారు ఈ ప్రదేశం లో నిద్రించారని కధనం .
125–లుటేరియా హనుమాన్
ఉత్తరప్రదేశ్ మధుర నుండి బృందావన్ కు వెళ్ళే దారిలో వ్రుందావన్ ద్వారం దగ్గర బాల కృష్ణుడు శ్రీ ఆంజనేయ స్వామిని కూర్చో బెట్టిన ప్రదేశమే లుటేరియా.ఇక్కడ కూర్చున్న హనుమ బాల కృష్ణుడికి పెరుగు అమ్ముకొనే గోపికలు ఎటు వెళ్ళారో తెలియ జెప్పెవాడట .గొల్లల పెరుగు దోచుకోవటానికి హనుమ కృష్ణుడికి సాయ పడ్డాడని అంటీ లూటీ చేయటానికి తోడ్పద్దాడని లుటేరియా హనుమాన్ అనే నిక్ నేఁ మ్ వచ్చింది . అంతేకాదు గజ దొంగలు ఈ హనుమాన్ కు మొక్కుకొని తాము దోచుకొన్న సంపదలో సగం ఆయనకు చెల్లిస్తామని ప్రతిజ్ఞ చేసేవారట .దోచుకోగానే దానిలో సగం స్వామి పాదాల చెంత పెట్టి వెళ్లి పోయేవారట .అందుకనీ లుటేరీ హనుమాన్ అయ్యాడు .
బీహార్
126-సీతా మడి-హనుమాన్
జనక మహా రాజు పుత్రిక కోసం యాగం చేస్తూ భూమిని దున్నుతుంటే సీత నాగేటి చాలు లో దొరికిన ప్రదేశమే సీతా మడి.ఇక్కడ సీతాదేవికి గుడి ఉంది .ఇక్కడే చాలా వినయం గా ఉన్న హనుమంతుడు దర్శనమిస్తాడు .హనుమ విగ్రహం మొదట్లో కాశీలో ఉండే రామ భక్తులకు లభించింది .వారికి స్వామి కలలో కనిపించి తనను సీతమ్మ తల్లి దగ్గర ప్రతిష్ట చేయమని కోరాడు .అలానే చేశారు .పుష్యమీ నక్షత్రం మంగళ వారం సీతా దేవి జన్మ నక్షత్రాన్ని, చైత్ర సుద్ధ నవమి శ్రీరామ నవమిని వైశాఖ బహుళ దశమి హనుమజ్జయంతిని వైభవం గా నిర్వహిస్తారు .
127–పాట్నా హనుమాన్
బిహార్ లో పాట్నా జంక్షన్ కు సమీపం లో పెద్ద హనుమాన్ మందిరం లక్షలాది భక్తులను ఆకర్షిస్తోంది .
అస్సాం
128– భక్తుడికి హనుమ భగవాన్ ప్రత్యక్షమైన చోటు –చుంగా జాన్
అస్సాం రాష్ట్రం లో నాగా లాండ్ అ దారిలో చుంగా జాన్ అనే చోట మహా భక్తుడైన బాబా శంకర దాస్ జీ కి శ్రీ హనుమ ప్రత్యక్షమైనాడు ఇక్కడే బాబా స్వామికి మహత్తర ఆలయ నిర్మాణం చేశాడు .