పశ్చిమ బెంగాల్ లో హవడాలకే దగ్గర రాజా కప్పరా లో రోడ్డుకు సమీపం లో రాజటారాకా లో శ్రీ పంచ ముఖీ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రఖ్యాతమైనది .ఈ విగ్రహాన్ని దాదాపు నూట యాభై ఏళ్ళ క్రితం తయారు చేయించి ప్రతిష్టిం చారు .విగ్రహ రూప శిల్పి స్వామి విగ్రహాన్ని శిల్పీకరిస్తుండగా అతని చేతి వేళ్ళు పని చేయకుండా పోయి గొప్ప ఇబ్బంది పడ్డాడు .హనుమ స్వామి శిల్పి కలలో కన్పించి విగ్రహం పూర్తీ అవగానే వేళ్ళు పని చేస్తాయని చెప్పాడు .స్వామి చెప్పినట్లుగానే విగ్రహ నిర్మాణం పూర్తీ కాగానే శిల్పి చేతి వ్రేళ్ళు యదా ప్రకారం పనీ చేయటం ప్రారంభించాయి .ఇది తనకు ఒక పరీక్ష అని శిల్పి భావించాడు .తన జీవితం ధన్యమైన్దనుకొన్నాడు .విపరీతం గా భక్తులను ఆకర్షించే దేవాలయం పంచముఖి హనుమ దేవాలయం . వరాహ ,గరుడ ,ఆంజనేయ ,నరసింహ ,హయ గ్రీవ ముఖాలతో స్వామి దర్శన మిస్తాడు .దశ భుజాలు ఒక పతాకం ,ఖడ్గం ,ఉరితాడు కలిగి ఉంటాడు .అయిదు దిక్కులా చూస్తూ ప్రజాసంక్షేమాన్ని చేస్తాదనటానికి నిదర్శనమే అయిదు ముఖాలు .అంటే సర్వ దిశా వీక్ష్ఞణంకలవాడు .దక్షిణ పంచముఖి హనుమాన్ అనీ పిలుస్తారు స్వామిని .
పశ్చిమ బెంగాల్ కలకత్తాలో నవాబు తీనే లో ఒక అంధ శిల్పి అతి భక్తితో రూపొందించిన పంచ ముక్షీ సంకట మోచన హనుమాన్ దేవాలయం చూడదగిన క్షేత్రం .విగ్రహం పూర్తికాగానే శిల్పి కి చూపు ప్రసాదించాడు హనుమ .
108– శ్రీ జబరేశ్వర అ హనుమాన్ –కలకత్తా
పశ్చిమ బెంగాల్ కలకత్తా పెద్ద బజారు దగ్గర సత్యనారాయణ పార్కు సమీపం లో జబదేశ్వార్ లో శ్రీ హనుమ ఆలయం ఉంది .ఆంజనేయ స్వామి భుజాలపై శ్రీ రామ లక్ష్మణులు కూర్చుని ఉండి మహా అనుభూతిని కల్గిస్తారు .
109-పురాతన హనుమాలయం –కలకత్తా
కలకత్తా మహా నగరం లో హారిసన్ రోడ్డు కు దగ్గరలో ఉన్న హనుమాన్ గలి లో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం 300 సంవత్సరాలకు పూర్వకాలానికి చెందినా పురాతన ఆలయం .బెంగాల్ లోని వివిధ ప్రాంతాలనుండి భక్తులు విశేషం గా వచ్చి సందర్శిస్తారు .భక్తులు ఈ ఆలయాన్ని’’ సిద్ధ పీఠం’’ అని పిలుస్తారు .అంటే కోరిన కోర్కెలను తీర్చే ప్రదేశం అని అర్ధం .
ఉత్తర ప్రదేశ్
110-హనుమాన్ గడి –అయోధ్య
అయోధ్యలోని శ్రీహనుమాలయం మహిమాన్వితమైనది .సరయు నదీ తీరానకొండమీద ఉన్నది డెబ్భై మెట్లు కొండపైకి ఎక్కి స్వామిని దర్శించాలి .ఒక సారి అయోధ్య నవాబు ‘’మన్సూర్ అలాక ‘’కొడుకు ఎవరికి అంతు బట్టని భయంకర తీవ్ర వ్యాధి తో బాధ పడ్డాడు ఎందరో వైద్యులు ఎన్నో రకాల వైద్యం చేసినా గుణం కనిపించలేదు .అప్పుడు నవాబు ఈ హనుమాన్ ను శరణు వేడాడు .కొద్దిరోజులకే నవాబు పుత్రుడు వ్యాధి నుండి కోలుకొని అందరికి ఆశ్చర్యం కలిగించాడు .దీనికి కృతజ్ఞతగా నవాబు స్థానిక శ్రీ అభయ రామ దాస జీ మహారాజ్ ను ప్రార్ధించి ఆయన చేత ఈ మందిరాన్ని నిర్మింప జేశాడు .ఈ ఆలయం మూడు వందల ఏళ్ళ నాటిది .ఇది గుహాలయం.గుహను ఆలయం గా తొలిచి అద్భుతంగా మలచారు .హనుమ ఈ గుహలో ఉండి అయోధ్యను సంరక్షణ చేసేవాడని కధనం
111-పహాడ్ పూర్ హనుమాన్
త్రేతాయుగం లో హనుమ సంజీవిని తెస్తూ ఇక్కడ భరతుని సమక్షం లో కాసేపు పర్వతం తో సహా కిందికి దిగి భరతుని కుశల ప్రశ్నలడిగి క్షేమ సమాచారాలు తెలుసుకొన్నాడు .పర్వతం తో ఇక్కడ దిగినందున పహాడ్ పూర్ అనే పేరొచ్చింది .అయోధ్యకు ఈ ఆలయం అయిదు కిలో మీటర్ల దూరం లో ఉంది .
112– వాల్మీకి ఆశ్రమం లో హనుమ –బిటూరు
కాన్పూర్ కు నలభై కిలోమీటర్ల దూరం లో ‘’బ్రహ్మా వర్తనం ‘’అని పిలువ బడే బిటూరు లో శ్రీ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది .సాక్షాత్తు బ్రహ్మదేవుడు నడయాడిన క్షేత్రం ఇది .అందుకే ‘’బ్రహ్మ వర్తనం ‘’అన్నారు .వాల్మీకి మహర్షి నివసించిన పుణ్య భూమి ఇది .సీతాదేవి లవ కుశులకు జన్మ నిచ్చింది ఈ ఆశ్రమం లోనే .ఈ కవలు శ్రీరాముని అశ్వమేధ అశ్వాన్ని కట్టేసి రాముడిటో రామ సోదరులతో యుద్ధం చేసిన ప్రదేశం .యాగాశ్వం వెంట వచ్చిన హనుమంతుడిని కట్టిపడేసిన ప్రదేశమూ ఇదే .ఇక్కడ హనుమకు గొప్పప ఆలయం నిర్మించారు .అందులో సీతమ్మ తల్లికి ఇరువైపులా లవ కుశ కుమారులు ఎదురుగా ఆంజనేయ స్వామి కొలువై ఉంటారు .ఇతిహాసానికి సజీవ సాక్ష్యం ఈ ఆలయం .ఈ ప్రాంతాన్ని కుశ లవులు పాలించారు .
113– గద్ద కంఠ హనుమాన్ లేక వ్యాస హనుమాన్
అరణ్య వాసం పూర్తీ అవగానే శ్రీ సీతా రామ లక్ష్మణ భారత శత్రుఘ్నులకు ఆంజనేయ స్వామి ఇక్కడే తన గద్ద కంఠం తో శ్రీ రామ కధను భక్తిపూర్వకం గా వినిపించాడు ఇక్కడ హనుమ వ్యాసమహర్షి రూపం లో దర్శన మివ్వటం ఒక ప్రత్యేకం వింత విశేషం .వ్యాస రూప మారుతిని అయోధ్యకు చెందిన రఘువీర నగర్ లో ప్రతిష్ట చేశారు .
114– సంకట మోచన హనుమాన్ –వారణాసి
ఉత్తరప్రదేశ్ లో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం వారణాసి లో ఈ సంకట మోచన హనుమాన్ దేవాలయం భక్తులను విశేషం గా ఆకర్షిస్తోంది .ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది .ఆంజనేయ స్వామికి మహా భక్తు డైన సంత్ తులసీదాస్ కు ‘’కర్ణా ఘంటా ‘’అనే చోట దర్శనం ఇచ్చి ఏమి కావాలో కోరుకోమన్నాడు .తులసీదాసు తనకు శ్రీ రామ మ దర్శనం చేయించమని ప్రార్ధించాడు .హనుమ కుడి చేయి ఎత్తి చూపిస్తూ ‘’వెళ్ళు చిత్ర కూట శ్రీ రామ దర్శన భాగ్యం పొందు ‘’అన్నాడు మళ్ళీ ఎడమ చేయి హృదయం మీద ఉంచుకొని ‘’నేనే దర్శన భాగ్యం కలిగిస్తాను ‘’అన్నాడు .తులసీదాసు ‘’స్వామీ ! భక్తుల కోసం మీరుఇదే రూపం లో ఇక్కడే ఉండండి ‘’అని ప్రార్ధించాడు .తధాస్తు అన్నాడు పవన తనయుడు .అంటే ఇక్కడ తులసీదాస మహా భక్తుని తపస్సు ఫలం చేత స్వయంభు గా అవతరించిన హనుమ మూర్తి ఇది .ఎప్పుడూ మహా రద్దీ గా ఉంటుంది .అనేక రకాల స్వీట్లు ఇక్కడ ప్రసాదాలుగా అమ్ముతారు .భక్తులు కొని స్వామికి నివేదన పెట్టిస్తారు .శ్రీరాముని సాన్నిధ్యం కావాలంటే హనుమ దర్శన భాగ్యం పొందాల్సిందే .అందుకే భక్తులు ఇక్కడ స్వామిని అంత భక్తితో సేవిస్తారు .శ్రీ రామ సాన్నిద్యానికి ఈ సంకట మోచన హనుమ దర్శనమ్ మొదటి మెట్టుగా అర్ధం చేసుకోవాలి .ఈ ఆలయం ‘’అసి నదీ’’ తీరాన ఉంది దీన్ని పండిత మదన మోహన మాలవ్యా గారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నిర్మించేటప్పుడు నిర్మించారు .శని దోషాలుంటే ఈ సంకట మోచనుడిని దర్శిస్తే పోగొడతాడు .అలాగే కుజ దోషాలనూ నివారించి మంగళకర జీవితాన్ని ప్రసాదిస్తాడు 6-3-2006నాడు తీవ్రవాదులు ఆలయం లో ప్రవేశిస్తే భక్తులు ఒకరికొకరు సాయం చేసుకొని వారిబారిడకుండా కాపాడుకొన్నారు .మర్నాడు విపరీతం గా భక్త జనం సందర్శించి స్వామికి కృతజ్ఞతలు తెల్పుకొన్నారు .నిరంతర హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది హనుమజ్జయంటతిని మహా వైభవం గా నిర్వహిస్తారు .సంకట మోచన్ ఫౌండేషన్ ఏర్పడి ఆలయాన నిర్వహణను చూస్తోంది .ఈ ట్రస్ట్ గంగానది శుద్ధికి ,పర్యావరణ పరిరక్షణకూ కూడా పని చేస్తోంది .ప్రతి ఏడాది ఎప్రిలో ‘’సంకట మోచన్ సంగీత సమారొహ్ ‘’ఉత్సవాన్ని ఘనం గా నిర్వహిస్తుంది .పండిట్ జస్రాజ్, కేలూ చరణ్ మహాపాత్రా , సంయుక్తా పాణిగ్రాహి వంటి ప్రముఖులు ఇక్కడ పాల్గొన్నారు .
115-గుఫీ కే హనుమాన్
వారణాసి లోని తులసీ మందిరం లో బాల రూపం లో శ్రీ హనుమాన్ దర్శన మిస్తారు ఈ స్వామిని ‘’గుఫీ కే హనుమాన్ ‘’అని ముద్దుగా పిలుచుకొంటారు .ఇదే తులసీదాసు సాధనా స్థలం .
116– హనుమాన్ ఘాట్
కాశీలో చత్రపతి శివాజీ మహారాజ్ గురు వరేన్యులు శ్రీ సమర్ధ రామ దాస స్వామి హనుమాన్ ఘాట్ లో స్వయం గా శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతిష్టించి దేవాలయ నిర్మాణం చేశారు .
117– బాల రూప హనుమాన్ –
కాశీలో భక్త తులసీదాస్ స్వయం గా శ్రీ హనుమ విగ్రహాన్ని స్థాపించారు .అదే బాలహనుమాన్ మందిరం .తులసీదాసు ఇక్కడ కొన్నేళ్ళు ఉన్నారు .అప్పుడే ప్రసిద్ధ రామ చరిత మానస్ గ్రంధాన్ని రాయటం ప్రారంభించి కొన్ని భాగాలు ఇక్కడే పూర్తీ చేశారు .